సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ శ్వేత సౌధంలో సేద తీరితే సరిపోదని, ప్రజల,ఉద్యోగుల బాగోగులను పట్టించుకోవాలని సూచించారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల పట్ల ప్రభుత్వ తీరును ఖండిస్తూ.. సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు సంజయ్.ఇకనైనా నిద్ర వీడి జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఆరు రోజులుగా రాష్ట్రంలో 9,350 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నా..సీఎం కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. తెలంగాణలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన విషయాన్ని మరిచిపోయారా? అని నిలదీశారు.జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీ కాలం పూర్తయినా..ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయమన్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని నాలుగేళ్లకు పొడిగించినప్పటికీ.. అన్నింటినీ భరిస్తూ వారు విధులు నిర్వర్తించారని తెలిపారు.ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. జూనియర్ పంచాయితీ కార్యదర్శులకు న్యాయం చేయాలని, తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు.









