మహాబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో దారుణ ఘటన వెలుగు చూసింది. జడ్చర్ల పట్టణంలోని రైల్వే బ్రిడ్జి కింద ఉన్న రైల్వే మురుగు కాలువలో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రైల్వే ట్రాక్ మురుగు కాల్వను రైల్వే కార్మికులు శుభ్రం చేస్తుండగా.. బ్రిడ్జి కింద కాలువలో ఓ బ్యాగు కనిపించింది. దుర్వాసన వస్తుండడంతో బ్యాగును ఓపెన్ చేసి చూడగా.. అందులో నెలలు నిండని శిశువు మృతదేహం లభ్యమైంది. దీంతో వారు రైల్వే అధికారులతో పాటు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అయితే చిన్నారిని అలా వదిలేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లి జరగకముందే గర్భం దాల్చిన యువతులకు.. పట్టణంలో అనేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో చట్ట వ్యతిరేకంగా అబార్షన్లు చేస్తున్నారని, ఈ నెలలు నిండని మృతశిశివు శవం కూడా అలాంటిదే అయ్యుండొచ్చని సందేహపడుతున్నారు.తమ బండారం బయటపడకుండా బ్యాగులో చుట్టి మురికి కాలువలో పడేసి ఉంటారని పట్టణ ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.









