మేడారం జాతర వచ్చిందంటే చాలు. కోట్లాది మంది భక్తులు కుటుంబ సమేతంగా అక్కడికి తరలివెళ్తారు. 4 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ జాతర జరుగుతుంది. విగ్రహాలు లేని విశిష్ట జాతరగా గుర్తించబడిన మేడారం జాతర ప్రతి రెండేళ్లకు ఒకసారి చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. 2024లో జరగనున్న జాతర తేదీలను మేడారం పూజారులు ప్రకటించారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర.. ములుగు జిల్లాలో జరిగే మేడారం జాతరకు దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. అందుకే ఈ జాతరకు తెలంగాణ కుంభమేళా అనే పేరుకూడా ప్రసిద్ధి.
ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని మేడారం గ్రామంలో ఈ మహా జాతర జరుగుతుంది. జాతర సమయంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మను పూజించేందుకు కోట్లాది భక్తులు తరలివస్తారు. రెండేళ్లకోకసారి మేడారం మహాజాతరను నిర్వహిస్తారు. అయితే మధ్యలో ఏడాది మినీ మేడారం జాతరను నిర్వహిస్తుంటారు. వచ్చే ఏడాది మేడారం మహాజాతర జరగనుంది. అయితే 2024లో సమ్మక్క సారలమ్మ మహాజాతర జరిగే తేదీలను పూజారుల సంఘం ప్రకటించింది. 2024 ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు ఆ జాతర నిర్వహించనున్నట్లు పేర్కొంది. 2024 ఫిబ్రవరి 21న సాయంత్రం 6 గంటలకు సారలమ్మ, గోవింద రాజులు, పగిడిద్ద రాజులు దేవుళ్లను గద్దెల మీదకు తీసుకొస్తారు. 22న సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తారు. 23 న ఈ దేవుళ్ళుకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే చివరి రోజు 24న దేవుళ్లు వనప్రవేశం చేస్తారు.









