తిరువనంతపురం రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించిన పీఎం
కేరళ తొలి వందే భారత్ రైలును తిరువనంతపురం రైల్వే స్టేషన్లో మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారు. కేరళ రాష్ట్రానికి తొలి వందే భారత్ రైలు లభించిందన్న ఉత్కంఠ గత వారం రోజులుగా స్థానికంగా నెలకొంది.
ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వానితుల కోసం మాత్రమే రైలును నడిపారు. మొదటి కమర్షియల్ సర్వీస్ బుధవారం కాసర్గోడ్ నుంచి ప్రారంభమై 7.50 గంటల్లో తిరువనంతపురం చేరుకుంటుంది. కాగా తిరువనంతపురం నుంచి మొదటి సర్వీసు గురువారం ప్రారంభం కానున్నది. రెగ్యులర్ కమర్షియల్ సర్వీసులు కొల్లాం, కొట్టాయం, త్రిస్సూర్, షోర్నూర్, కోజికోడ్, కన్నూర్లతో నిలుస్తాయి. తర్వాత కాసర్గోడ్లో ముగుస్తాయి. మోడీ జెండా ఊపి ప్రారంభించిన ‘ప్రత్యేక రైలు’ మరిన్ని స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు 16 కోచ్లున్నాయి. అందులో 104 సీట్లతో రెండు ఎగ్జిక్యూటివ్ కోచ్లున్నాయి. ప్రారంభోత్సవ రన్కు మత నాయకులు, బిజినెస్మెన్, టెక్నోక్రాట్స్ను ఆహ్వానించారు.









