జపాన్లోని కుమమొటో ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం సమయంలో ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. 7.1 తీవ్రతతో భూకంపం సంభవించిన సమయంలో ఆస్పత్రి భవనం ఒక్కసారిగా బలంగా ఊగిపోయింది. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్లో ఓ రోగికి సర్జరీ జరుగుతోంది. దీంతో అక్కడున్న వైద్యులు, నర్సులు తీవ్ర ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొన్నారు.
అయితే తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బయటకు వెళ్లకుండా వైద్య బృందం సర్జరీని కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఆపరేషన్ టేబుల్ను స్థిరంగా ఉంచుతూ, రోగి చుట్టూ రక్షణగా నిలబడి సర్జరీని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. భవనం ఊగుతున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా ఎంతో ప్రశాంతంగా వ్యవహరించిన వైద్యులు.. ఆపరేషన్ మధ్యలో రోగిని వదిలిపెట్టకుండా తమ బాధ్యతను నిర్వర్తించారు.
చివరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి రోగి ప్రాణాలను కాపాడారు. ఈ ఘటనకు సంబంధించినదిగా చెబుతున్న సీసీటీవీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు వైద్యుల అంకితభావం, ధైర్యసాహసాలను ప్రశంసిస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను లెక్కచేయకుండా రోగిని కాపాడిన వైద్యులు, నర్సులు నిజమైన దేవుళ్లంటూ కామెంట్లు చేస్తున్నారు.








