హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అరుదైన రికార్డును సొంత చేసుకుంది. దేశంలోనే అత్యంత రద్దీ విమానాశ్రయాల్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఒక్క ఏడాదిలోనే (2022-23 ఆర్థిక సంవత్సరంలో) శంషాబాద్ విమానాశ్రయం నుంచి 2.10 కోట్ల మంది ప్రయాణికులు తమ రాకపోకలను సాగించారు. దీంతో వేగంగా వృద్ధి సాధిస్తున్న విమానాశ్రయాల్లో శంషాబాద్ ఎయిర్ పోర్టు ఒకటిగా నిలిచింది.
శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా, ఐరోపాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఇండియాలోని మిగతా ఇంటర్నేషనల్ విమానాశ్రాయలతో పోలిస్తే.. శంషాబాద్ నుంచే ప్రయాణీకుల రాకపోకల సంఖ్య ఎక్కువగా ఉంది. ఈ ఎయిర్పోర్టు నుంచి న్యూయార్క్, శాన్ ఫ్రాన్సిస్కో, షికాగో, డల్లాస్, పారిస్, ప్రాంక్ఫర్ట్లకు రాకపోకలు కొనసాగించేవారి సంఖ్య పెరిగింది. హైదరాబాద్కు రెండు, మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంటున్న కర్ణాటక, మహారాష్ట్రలకు చెందిన ప్రజలు.. ముంబై, బెంగుళూరు ఎయిర్పోర్టులకు వెళ్లకుండా ఇక్కడి నుంచే వెళ్లేందుకు మెుగ్గు చూపుతున్నారు.
కరోనాకు ముందు హైదరాబాద్ నుంచి 55 దేశీయ గమ్యస్థానాలుండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 70కు చేరాయి. ఇటీవల హైదరాబాద్ – కొలంబో విమాన సర్వీసులను కూడా పునరుద్ధరించారు. బాగ్దాద్, ఢాకా, డాన్ ముయాంగ్కూ సర్వీసులు ప్రారంభమయ్యాయి. పెరుగుతున్న రద్దీని తట్టుకోవడానికి శంషాబాద్ విమానాశ్రయ సామర్థ్యాన్ని 3.4 కోట్లమంది అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తున్నామని విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు.









