తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) హమీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామన్నారు. ఎకరాకు పది వేల నష్ట పరిహారం అందిస్తామని తెలిపారు. అలాగే సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో కొనుగోలు కేంద్రాలు ముందుగానే ఏర్పాటుచేయడంతో నష్టం కొద్దిమేర తగ్గిందని అన్నారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణంలోని చమాన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ఆరు గ్రామాల్లో 5వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. మొదటి విడత పంటనష్టంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎనిమిదన్నర కోట్లు విడుదల అయ్యాయని త్వరలోనే వాటిని రైతులకు అందజేయడంతో పాటు ప్రస్థుత నష్టాన్ని పూర్తి స్థాయిలో రెండు మూడురోజుల్లోనే అంచనా వేసి ఆదుకుంటామన్నారు.









