తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ నేతలు.. వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా బీఆర్ఎస్ తీరును ఎండగడుతూ.. ప్రజల్లోకి వెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. బహిరంగ సభలు నిర్వహిస్తూ గులాబీ లీడర్లకు గుబులు పుట్టిస్తున్నారు.ఎన్నికలు దగ్గర పడుతుంటంతో.. హస్తినా పెద్దలు సైతం తెలంగాణపై ఫోకస్ పెంచారు.
ఇందులో భాగంగానే కేంద్రహోంమంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు.ఈ నెల 23న ‘షా’ హైదరాబాద్ వస్తున్నారు.26న చేవెళ్లలో భారీ బహిరంగ సభకు రాష్ట్ర నాయకులు కసరత్తు చేస్తున్నారు. సభ నిర్వహణపై మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.
ఇదిలా ఉండగా బహిరంగ సభలో అమిత్ షా కీలక ప్రకటనలు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా భారీగా చేరికలు కూడా ఉంటాయని సమాచారం.మరోవైపు అధికార బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన పొంగులేటి శ్రీనివాస రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇంతవరకూ తమ భవిష్యత్ కార్యాచరణపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఏ పార్టీలో చేరతారనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు నేతలు షా సమక్షంలో బీజేపీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది.









