చీమలపాడు ప్రమాదం తీవ్ర ఆవేదనకు గురిచేసిందని.. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆమె ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమాయకులతో పాటు పోలీసులు, జర్నలిస్టులు కూడా తీవ్రంగా గాయపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు, ఒక ప్రభుత్వ ఉద్యోగం.. క్షతగాత్రులకు రూ. 20లక్షల పరిహారం, మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా చీమలపాడులో బీఆర్ఎస్ సమ్మేళనానికి అనుమతి ఇవ్వడంపై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రతిపక్షాలు సమావేశమయ్యేందుకు అనుమతి ఇవ్వడం లేదని.. పనికిమాలిన బీఆర్ఎస్ మీటింగ్ లకు ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించారు. మండుటెండలో బాణాసంచా పేలుస్తుంటే ఏం చేస్తున్నారు? అని నిలదీశారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా మీటింగ్కు, ప్రమాదానికి సంబంధం లేదని బీఆర్ఎస్ ఎంపీ సిగ్గులేకుండా చెబుతున్నారని షర్మిల మండిపడ్డారు.