ఢిల్లీలో జరిగిన అంతర్జాతీయ ఏఐ సదస్సులో యూత్ కాంగ్రెస్ నాయకులు నిర్వహించిన నిరసనలపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు ఇలాంటి ప్రవర్తన దేశ ప్రతిష్ఠను దిగజార్చడమేనని, ఇది సిగ్గుచేటని ఆయన విమర్శించారు. రాజకీయ విభేదాలు ఏమున్నా అంతర్జాతీయ వేదికలపై దేశం తరపున ఐక్యంగా నిలబడాలని ఆయన హితవు పలికారు.
జగన్ చేసిన ఈ విమర్శలపై భారత యూత్ కాంగ్రెస్ (IYC) అంతే ఘాటుగా స్పందించింది. జగన్ తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల భయంతోనే కొన్ని శక్తులతో రాజీ పడుతున్నారని ఆరోపించింది. కేసులు ఉన్నాయన్న కారణంతో కనీసం తన తండ్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని మరియు ఆయన ఆశయాలను కించపరచవద్దని చురకలు అంటించింది.
వైఎస్సార్ తన జీవితాంతం విభజన శక్తులతో పోరాడారని, అలాంటి త్యాగధనుడి కుమారుడై ఉండి ఇలా మాట్లాడటం సరికాదని యూత్ కాంగ్రెస్ పేర్కొంది. సదస్సులో తమ నిరసన ప్రజాస్వామ్యబద్ధమని, దేశ ప్రతిష్ఠను తాము ఎప్పుడూ కాపాడతామని వెల్లడించింది. ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.








