తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత రచించిన ‘రుద్ర’ అనే పుస్తకాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు. శివపురాణంలోని విశేషాలను నేటి యువతకు అర్థమయ్యే రీతిలో సులభంగా వివరించాలనే ఉద్దేశంతో సుష్మిత ఈ పుస్తకాన్ని రూపొందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక విలువలు, సాంస్కృతిక వారసత్వాన్ని భావి తరాలకు అందించేలా ఇలాంటి పుస్తకాలు రావడం అభినందనీయమని, సుష్మిత ప్రయత్నాన్ని ప్రత్యేకంగా మెచ్చుకున్నారు.
పుస్తకావిష్కరణ సమయంలో ఒక ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. సుష్మిత చిరంజీవిని ఉద్దేశించి.. “థాంక్యూ పెదనాన్న, నేను రాబోయే కాలంలో రాసే ‘అశ్వద్ధామ’ పుస్తకాన్ని కూడా మీరే రిలీజ్ చేయాలి” అని కోరారు. దానికి చిరంజీవి తనదైన శైలిలో స్పందిస్తూ.. “అమ్మా నాకు అంత పని పెట్టకు, వేరే ఎవరినైనా చూసుకో.. నా అసలు పేరు శివశంకర వరప్రసాద్ కాబట్టి, శివుడి గురించి రాసిన ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశాను. మరో పుస్తకాన్ని మరొకరితో చేయించు” అని నవ్వుతూ అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సాధించిన విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. యువతకు ఆదర్శంగా నిలిచేలా శివపురాణంపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ రచన చేసినట్లు ఆమె తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి తమ ఆహ్వానాన్ని మన్నించి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. సుష్మిత భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు చేసి తన తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని చిరంజీవి ఆశీర్వదించారు.









