టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ర్యాన్ఎయిర్ సీఈఓ మైఖేల్ ఓ’లియరీ మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు ఆ సంస్థ కొనుగోలు ప్రతిపాదన వరకు వెళ్లింది. విమానాల్లో స్టార్లింక్ వైఫై సేవలను ఏర్పాటు చేసే విషయంలో ఇద్దరు సీఈఓల మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఒకరినొకరు ‘ఇడియట్’ అని దూషించుకోవడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలోనే మస్క్.. “ర్యాన్ఎయిర్ను కొనుగోలు చేయాలా వద్దా?” అని తన ఎక్స్ యూజర్ల అభిప్రాయాన్ని కోరుతూ ఒక పోల్ నిర్వహించారు.
ఈ పోల్కు నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. కొద్ది గంటల్లోనే సుమారు 7.5 లక్షల మందికి పైగా ఓటు వేయగా, అందులో దాదాపు 76 శాతానికి పైగా యూజర్లు మస్క్ ఆ ఎయిర్లైన్స్ను కొనుగోలు చేయడానికే మొగ్గు చూపారు. ర్యాన్ఎయిర్ సీఈఓ ఓ’లియరీ తనను వ్యక్తిగతంగా విమర్శించినందుకు ప్రతిగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కూడా ట్విట్టర్ కొనుగోలు విషయంలో మస్క్ ఇలాగే పోల్ నిర్వహించి, ఆ తర్వాత దానిని హస్తగతం చేసుకున్న విషయాన్ని నెటిజన్లు గుర్తు చేసుకుంటున్నారు.
అయితే, ఈ పోల్ కేవలం ఓ’లియరీకి కౌంటర్ ఇవ్వడానికి చేసిన సరదా పనా లేక నిజంగానే మస్క్ విమానయాన రంగంలోకి అడుగుపెట్టబోతున్నారా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓ’లియరీని “అట్టర్ ఇడియట్” అని సంబోధిస్తూ, అతడిని బాధ్యతల నుంచి తొలగించాలని మస్క్ ఘాటుగా వ్యాఖ్యానించారు. స్టార్లింక్ ఖర్చుల విషయంలో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు ఒక పెద్ద కార్పొరేట్ టేకోవర్ చర్చకు దారితీయడం విశేషం.









