నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో చిరుతపులి (Leopard) సంచారం కలకలం సృష్టించింది. మంగళవారం తెల్లవారుజామున మండలంలోని కాల్వ లక్ష్మీనర సింహ స్వామి ఆలయం సమీపంలో నిర్మల్-భైంసా జాతీయ రహదారిపై వాహనదారులకు చిరుతపులి కనిపించింది. దీంతో తమ సెల్ఫోన్లలో చిరుతను బంధించారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. కాగా, చిరుత సంచారంతో సమీపంలోని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ను వణికిస్తున్న పులులు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పులులు వణికిస్తున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్-మంచిర్యాల జిల్లాల సరిహద్దుల్లో గతంలో ఉన్న రెండు పులులు కాస్తా.. 11కు పెరగడంతో ఇదిగో పులి.. అదిగో టైగర్ అన్న హెచ్చరికలతో స్థానికులు జంకుతున్నారు. పులుల భయంతో రోజువారీ పనులకు వెళ్లేందుకు అటవీ సమీప గ్రామాల ప్రజలు భయపడుతున్నారు. తాజాగా ఎర్రగుంట గ్రామశివారులో అటవీ అధికారులు పులి కదలికలను గుర్తించారు.
మంచిర్యాల జిల్లా ముల్కల్లబీట్ పరిధిలోనూ మరో ఆడపులి సంచారాన్ని కనిపెట్టారు. ఇక్కడే మరో ఆడపులి ట్రాప్కెమెరాకు చిక్కింది. ఇదే ఏరియాలో మరో మగపులి సంచరిస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు. మందమర్రి, అందుగులపేట, తాండూరు మండలం నీలాయిపల్లి సమీపంలో పులి సంచారం కలకలం రేపుతోంది. బొంబాయిగూడ గ్రామ శివారులోని ఉచ్చమల్లవాగుతోపాటు సమీప పంటచేలల్లో మేకలకాపరులు పులి పాదముద్రలను చూసినట్టు తెలిపారు. పులల సంచారంతో అలర్ట్ అయిన అటవీశాఖ అధికారులు గ్రామాల్లో చాటింపు వేయిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.