విద్యుత్ చార్జీల అంశంపై ఈఆర్సీ దగ్గరకు వెళ్లటమా?
కేటీఆర్పై మంత్రి కోమటిరెడ్డి ధ్వజం
(మహా, హైదరాబాద్):
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించినా కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. మంగళవారం అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ అసెంబ్లీని అఘాఖాన్ ట్రస్ట్ రూ. 49 కోట్ల అంచనాతో రెనోవేట్ చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 3 నెలల్లో అసెంబ్లీలో చేపట్టిన పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్రెడ్డి చెప్పారని అన్నారు. నిజాం తరహాలో అసెంబ్లీని ఎలా కట్టారో అలా మార్పులు చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ తరహాలో అసెంబ్లీ, కౌన్సిల్ ఒకే దగ్గర ఏర్పాటు చేస్తున్నామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.
ఇప్పుడు అసెంబ్లీ నుంచి కౌన్సిల్కు వెళ్లాలంటే వాహనంలో సీఎం, మంత్రులు వెళ్లాల్సి వస్తోందని తెలిపారు. ఒకే దగ్గర ఉంటే టైం సేవ్ అవుతుందని చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ చార్జీల అంశంపై ఈఆర్సీ దగ్గరకు వెళ్లటం పెద్ద జోక్ ఆయన ఓ జోకర్ అని విమర్శించారు. పార్లమెంట్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాలేదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించిన కూడా బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావడం లేదని మండిపడ్డారు. 200 యూనిట్ల ఫ్రీ కరెంటు పేదవారికి తమ ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.









