రేవంత్ సర్కార్ త్వరలో తీపి కబురు
ఔటర్ రింగు రోడ్డు లోపలే ఇచ్చేందుకు కసరత్తు
26న జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం?
మూసీ పునరుజ్జీవంలో భాగంగా పరీహహక ప్రాంతంలో ఇళ్లు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే పలువురు నిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అయినట్లు తెలిసింది. ఈనెల 26న జరిగే కేబినెట్ భేటీలో ఈ విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.
మూసీ ప్రక్షాళనకు చర్యలు వేగిరం..
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ప్రవహించే మూసీ నది ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకంటున్న సంగతి తెలిసిందే. మూసీ పునరుజ్జీవనం పేరుతో గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా మూసీ పరివాహకప్రాంతాల్లోని అక్రమణలను తొలగిస్తోంది. రివర్ బెడ్ ప్రాంతంలోని ఇండ్లను కూల్చేయాలని భావిస్తోంది. ఈ మేరకు మూసీ నిర్వాహిసుతులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను కేటాయిస్తోంది. ఇప్పటికే పలువురు మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశారు. రూ.25వేల చొప్పున నగదు, ఉపాధి కోసం రూ.2 లక్షల లోన్లను ప్రభుత్వం అందజేస్తోంది.
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు?
తాజాగా.. మూసీ బాధితులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఔటర్ రింగ్ రోడ్డు వెంట నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఇవ్వాలని రేవంత్ సర్కార్ భావిస్తోందట. అయితే ఈ నెల 26న తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఆ భేటీలో మూసీ నిర్వాసితులకు ఇండ్ల జాగాలు ఇచ్చే విషయంపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఒక్కో కుటుంబానికి 150 నుంచి 200 చదరపు గజాల చొప్పున ప్లాట్ అందజేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఆయా ప్లాట్ల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.25 లక్షల నుంచి రూ. 30 లక్షల దాకా ఉంటుందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు లోపలే..
హైదరాబాద్ నగరం నాలుగు వైపులా ఔటర్ రింగ్ రోడ్డు లోపలే వారికి ఇళ్ల జాగాలు ఇవ్వాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కాగా, మూసీ నిర్వాసితులు దాదాపు 13 వేలకు పైగానే ఉంటారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఒక్కో కుటుంబానికి 150–200 చదరపు గజాల చొప్పున అందజేసినా మెుత్తం 600–700 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ భూములను గుర్తించాల్సిన అవసరం ఉంది.









