– ఫామ్హౌస్లు కాపాడుకునేందుకే వారి తాపత్రయం
– బీఆర్ఎస్ నేతల ఫామ్ హౌస్ డ్రైనేజీ నీటిని పేదలకు వేళ్లే తాగునీటిలో కలుపుతారా..
– సీఎం రేవంత్రెడ్డి ఆగ్రహం
– మూసీ పునరుజ్జీవం వేరు.. హైడ్రా వేరని స్పష్టీకరణ
తెలంగాణ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని కొంతమంది చూస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం అలాంటివారి భరతం పడుతుందని హెచ్చరించారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీశ్రావు, ఈటల రాజేందర్ బయటకు వచ్చారని.. పేదలు ఎవరైనా ఫామ్హౌస్లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబంతో కేసీఆర్ కుటుంబానికి ఏమైనా పోలిక ఉందా? అని నిలదీశారు. ప్రధాన మంత్రి పదవినే త్యాగం చేసిన చరిత్ర సోనియా గాంధీది అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద శనివారం రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ దినం సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను కొనియాడారు. అలాగే సద్భావన అవార్డుకు ఎంపికైన గీతారెడ్డిని కూడా ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పాలనలో పేదలకు అన్యాయం జరిగే ప్రసక్తే లేదన్నారు. గత పదేళ్ల ప్రభుత్వ పాలనలో పేదలకు అసలైన అన్యాయం జరిగిందని, అందుకే రాష్ట్ర ప్రజల మన్ననలు పొంది తాము అధికారం చేపట్టామన్నారు. గాంధీ కుటుంబం ఉంటేనే దేశంలోని అన్ని వర్గాల అభ్యున్నతి సాధ్యమవుతుందని, మహిళలకు రిజర్వేషన్ లు అమలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సొంతమన్నారు.
బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు..
ఇక బీఆర్ఎస్ పై ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు. నిన్న కేటీఆర్, హరీష్ రావులు చేసిన వ్యాఖ్యలపై సీఎం మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం మొత్తం దోపిడీ చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యమన్నారు. తాము హైదరాబాద్ నగర వాసులకు భవిష్యత్ లో ఇబ్బందులు తలెత్తకూడదని, చెరువులలో ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు హైడ్రాను ప్రవేశపెట్టామన్నారు. హైడ్రాను చూసి భయపడేవారు ఎవరో కాదు ఆక్రమణలకు పాల్పడిన వారేనన్నారు. కుంటలలో, నాలాలలో గహాలు కట్టుకుంటే వరదలు వచ్చిన సమయంలో ఇబ్బందులు పడేది కూడా ప్రజలేనని గమనించాలన్నారు.
రాష్ట్రాన్ని దెబ్బ తీయాలని చూస్తున్నారు..
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు సీఎం రేవంత్ అన్నారు. అలాగే కేటీఆర్, హరీష్ రావులు తమ ఫామ్ హౌస్ లు కాపాడుకోవడానికి, పేదలను ముందు ఉంచుతున్నానన్నారు. మూసీ భాదితులకు తాము ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నా కూడా బీఆర్ఎస్ నేతలు సహించలేక పోతున్నారన్నారు. అన్నీ లంగా మాటలు.. దొంగ నాటకాలు చేస్తూ బుల్డోజర్ లకు అడ్డు తగులుతామని చెబుతున్నారని, కానీ నేను కూడా అవసరం లేదు.. మా సీనియర్ నాయకుడు హనుమంతరావు చాలన్నారు. హరీశ్రావు చెప్పులు మోసే రకమని, తన ఇంటి ముందు చేతులు కట్టుకొని నిలబడ్డ రోజులు మరచిపోయావా అంటూ హరీశ్ రావును ఉద్దేశించి ప్రసంగించారు. మూసీ పునరుజ్జీవం కోసం తాము తాపత్రయ పడుతుంటే.. అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నం చేస్తుందన్నారు. అజీజ్ నగర్ లో హరీశ్రావు, జన్వాడ లో కేటీఆర్ ఫామ్ హౌస్ లు ఆక్రమణలకు పాల్పడి నిర్మించారని, వాటిపై నిజనిర్ధారణ కమిటీ వేస్తామన్నారు.
ప్రతి హామీని నెరవేరుస్తాం..
పేదప్రజల పక్షపాతిగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తుందన్నారు. ఇటీవల ఎన్నో పథకాలు ప్రవేశపెట్టామని, నిరుద్యోగులకు ఉద్యోగవకాశాలు కల్పించామన్నారు. అంతేకాకుండా.. రాష్ట్రంలో విద్యాభివృద్దికై యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, యూనివర్శిటీలు నిర్మిస్తున్నామన్నారు. తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి పాలన సాగిస్తున్నామని, పేదల పక్షాన తానెప్పుడూ ఉంటానని సీఎం రేవంత్ అన్నారు.









