ఇక సిమ్ లేకుండానే ఫోన్కాల్స్!
రిలయన్స్, ఎయిర్టెల్కు మాస్టర్ స్ట్రోక్..
(మహా, న్యూఢిల్లీ):
ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరోమారు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. గ్లోబల్ శాటిలైట్ కమ్యూనికేషన్ సంస్థ ‘వియాసత్’తో కలిసి ‘డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మేరకు ట్రయల్స్ కూడా పూర్తిచేసుకుంది. అంతేకాదు, స్మార్ట్ వాచ్తోపాటు మార్కెట్లో అందుబాటులో ఉన్న ఇతర స్మార్ట్ డివైజ్లకు కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర సేవలను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతోనే ఈ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఎలా పనిచేస్తుంది?
డైరెక్ట్ టు డివైజ్ సాంకేతికతతో సిమ్కార్డు లేకుండానే మొబైల్ ఫోన్లు, స్మార్ట్వాచ్లు, కార్ల యజమానులు కూడా నేరుగా శాటిలైట్ నెట్వర్క్తో అనుసంధానం కావొచ్చు. పర్సనల్, డివైజ్ కమ్యూనికేషన్ కు సపోర్ట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఎక్కడున్నామన్న దానితో సంబంధం లేకుండా నిరంతర కనెక్టివిటీని ఇది అందిస్తుంది. యూజర్లకు ఇది గొప్ప కవరేజీ ఇవ్వడంతోపాటు నమ్మకమైన కమ్యూనికేషన్ అందిస్తుంది. మరీ ముఖ్యంగా మారుమూల ప్రాంతాలకు గొప్ప ఉపయోగకరంగా ఉంటుంది.
మొబైల్ టవర్లతో పనిలేదు..
శాటిలైట్ కమ్యూనికేషన్లో భాగమైన డైరెక్ట్ టు డివైజ్ సేవల్లో ఇక మొబైల్ టవర్లతో పని ఉండదు. ఇంకా చెప్పాలంటే శాటిలైట్ ఫోన్లలా అన్నమాట. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్ వాచ్లు, ఇతర స్మార్ట్ డివైజ్లను నేరుగా ఈ టెక్నాలజీ సాయంతో అంతరాయం లేని కాల్స్ మాట్లాడుకోవచ్చు. ట్రయల్స్లో భాగంగా 36 వేల కిలోమీటర్ల దూరంలోని ఉపగ్రహాన్ని ఉపయోగించి దిగ్విజయంగా ఫోన్∙కాల్ చేయడం జరిగింది.









