(అమ్మన్యూస్, హైదరాబాద్):
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి భేషరతుగా బీజేపీ క్షమాపణలు చెప్పాల్సిందేనని కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీపై బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలుపుతూ.. బుధవారం కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, వీహెచ్, కట్టా సాయి కుమార్ సహా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ ఆరా మండిపడ్డారు. మరోవైపు రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఏఐసీసీ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కాంగ్రెస్ నాయకులు రోడ్లపైకి వచ్చి ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు.
దిష్టిబొమ్మల దహనం..
బీజేపీ నేతల వైఖరికి నిరసన తెలుపుతూ.. వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ నేపథ్యంలోనే గాంధీభవన్ లో కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో బీజేపీ నేతల ఫొటోలతో ధర్నా నిర్వహించారు. బీజేపీ నాయకుల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. అంతేగాక పబ్లిక్ మీటింగ్ లో బెదిరించినా.. బీజేపీ అగ్ర నాయకులు స్పందించకపోవడంపై నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడంతో పోలీసులు అడ్డగించారు. దీంతో కాంగ్రెస్ నాయకులు, పోలీసుల మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. కాగా ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు తన్వీందర్ సింగ్ ఆరా ఓ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతూ.. మీ నానమ్మకు పట్టిన గతే నీకు పడుతుందని రాహుల్ గాంధీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ నేత వ్యాఖ్యలు సరికాదని మండిపడుతున్నారు. అతని బీజేపీ కార్యవర్గం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.