జన్నారం మండలం కొమ్ముగూడెంలో పర్యటన
రైతు ప్రభుత్వమని వెల్లడి
వ్యవసాయ కూలీలకు రైతులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
అమ్మన్యూస్ ఆదిలాబాద్ : ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నాయకురాలు ఆత్రం సుగుణక్క రైతుల సమస్యలు తెలుసుకోవడానికి పొలంబాట పట్టారు..మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కొమ్ముగూడెంలో గురువారం పర్యటించిన ఆమె సాధారణ వ్యవసాయ కూలీలా మారి ఓ రైతు పొలంలో నాటు వేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.స్వయంగా వరి నారు పీకి..పొలంలోకి దిగి నాట్లు వేశారు. గతంలో కూలీగా తాను కూడా తన గ్రామంలో నాట్లు వేశానని, పాఠశాలకు వెళ్లేటప్పుడు పొలం గట్టుపై నుంచి నడుచుకుంటూ వెళ్లే దాన్ని అని చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం సాగు పద్ధతులను,పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు పలు అంశాలను రైతుల్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. ఇప్పటికే లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేయడం జరిగిందని గురువారం నుంచి రూ.2 లక్షల లోపు రుణమాఫీ చేయటం జరుగుతుందని అన్నారు.రుణమాఫీ విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తనను సంప్రదించాలని సూచించారు.రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని,సాగుకు సంబంధించి సలహాలు సూచనల కోసం వ్యవసాయ నిపుణులతో సమావేశాలు ఏర్పాటు చేసి రైతుల సందేహాలు తీర్చేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా సుగుణక్క తెలిపారు. పొలంలో వ్యవసాయ కూలీలకు రైతులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మిఠాయి తినిపించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ కన్వీనర్ సునీల్ జాదవ్,రైతులు ఆత్రం మారు పటేల్, అజ్మీర గోవింద్, మహిళా రైతులు మానుకు బాయి,గంగుబాయి,ఆత్రం జంగుబాయి, ఆత్రం స్వరూప తదితరులు ఉన్నారు.









