బీఆర్ఎస్ ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ ప్రచార కో కన్వీనర్, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని యావత్తు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఖమ్మంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం యువతను నట్టేట ముంచిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతతో రెండు పర్యాయాలు పరీక్షలను రద్దు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోను చూసే బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రకటించారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలు ఏలా అమలు చేస్తారని ఎద్దేవా చేశారు.. కానీ, ఇప్పుడు వాళ్ళు ఏలా అమలు చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ స్కీములు కాపీ కొట్టాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు.
బందిపోట్లు అనే పదాన్ని వాడే హక్కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు లేదన్నారు. నీళ్ళు, నిధులు, నియమాకాలు కాంగ్రెస్ చేపడుతుందన్నారు. కాంగ్రెస్ మొదటి లిస్టులోని అభ్యర్థులందరూ గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ యాత్రను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీ నుండి సీట్లు అడుగుతున్న వారికి సీట్లు రాకపోయినా వారికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రాయల నాగేశ్వరరావు పార్టీకి అండగా నిలిచారని కొనియాడారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అక్టోబర్18న ములుగు జిల్లా నుండి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ములుగు నుంచి ప్రారంభమయ్యే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బస్సు యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.









