టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అధికారులు నాలుగు గంటలుగా ప్రశ్నిస్తున్నారు. సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి నేతృత్వంలోని బృందం ఆయనను కార్యాలయంలోని ఐదో ఫ్లోర్లో విచారిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి టీడీపీ అధినేతకు 20కు పైగా ప్రశ్నలు సంధించినట్లుగా తెలుస్తోంది. ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలకు సమాధానాలు రాబడుతున్నారు. ఎస్పీజీ సెక్యూరిటీ సమక్షంలోనే ఆయన విచారణ కొనసాగుతోంది. విచారణ మధ్యలో చంద్రబాబును ఆయన న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ కలిశారు.
మరోవైపు, చంద్రబాబును కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులు సిట్ కార్యాలయంలో నాలుగో ఫ్లోర్లో చాలాసేపు వేచి చూసి, చివరకు రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో కలిశారు. నారా లోకేశ్, భువనేశ్వరి రెండు మూడు గంటలకు పైగా వేచి చూశారు. రాత్రి తొమ్మిది గంటల సమయంలో నందమూరి బాలకృష్ణ, నారా బ్రాహ్మణి సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. కాసేపటి క్రితం నలుగురూ టీడీపీ అధినేతను కలిశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ధర్మం తనవైపే ఉందని, కుట్రపూరిత రాజకీయాలను సమర్థవంతంగా ఎదుర్కొంటానని, ఆందోళన చెందవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబును చూసిన తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి అక్కడి నుండి వెళ్లిపోగా, బాలకృష్ణ, లోకేశ్ అక్కడే ఉండిపోయారు.









