న్యూఢిల్లీ: భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్లో కుప్పకూలింది. హనుమాన్గఢ్ గ్రామం సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ యుద్ధవిమానం సూరత్గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. అయితే మిగ్-21 కూలిపోవడానికి ముందే పైలట్ పారాచూట్ సాయంతో సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ విమాన శకలాలు తగిలి ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు.
మరొకరు గాయపడ్డారు. వీరు నివసించే ప్రాంతంలోనే విమానం కూలినట్లు తెలుస్తోంది. సాధారణ శిక్షణలో భాగంగానే బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైనట్లు భారత వైమానిక దళం తెలిపింది. పైలట్ స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడినట్లు పేర్కొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించింది.









