మహబూబ్నగర్ : పరిశ్రమలకు ఊతమిస్తేనే కొలువులు వస్తాయి.. రాష్ట్రానికి సంపద వస్తుంది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా (Amara raja) లిథియం అయాన్ బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud), ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్తో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు. అనంతరం పవర్పాయింట్ ప్రజెంటేషన్, బ్యాటరీ కంపెనీ ప్రతినిధులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. లిథియం అయాన్ బ్యాటరీ మేకింగ్లో భారతదేశంలోనే ఇది అతి పెద్ద పెట్టుబడి అని కేటీఆర్ పేర్కొన్నారు. అమరరాజా గ్రూప్ రూ. 9,500 కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినందుకు అమర రాజా కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే పెట్టుబడులు వస్తాయి..
ఒక పరిశ్రమ రావాలంటే దాని వెనుకాల తదేకమైన దీక్షతో, పట్టుదలతో పని చేస్తేనే వస్తాయి. ఇది పోటీ ప్రపంచం. పోటీ ప్రపంచంలో అవినీతి రహిత పారదర్శకమైన పాలనతో ముందుకు వెళ్తున్నాం. ఈ దేశంలో ఎక్కడైనా అమరరాజా గ్రూప్ ప్లాంట్ పెట్టుకోవచ్చు. దివిటిపల్లిలో ప్లాంట్ పెడుతామని ప్రకటించిన తర్వాత 8 రాష్ట్రాల సీఎంలు, మంత్రులు వారికి ఫోన్ చేసి తమ తమ రాష్ట్రాలకు రావాలని ఆహ్వానించారు. కానీ అమరరాజా గ్రూప్ వారు ఇక్కడే ప్లాంట్ ప్రారంభించేందుకు సముఖత వ్యక్తం చేశారు.
అమరరాజా యూనిట్ ఏర్పాటుతో 10 వేల మందికి ఉపాధి..
రాష్ట్రం ఏర్పడే నాటికి హైదరాబాద్ ఐటీ రంగంలో 3లక్షల 23 వేల మంది పని చేసేవారు. ఇప్పుడు దాదాపు 10 లక్షల మంది ప్రత్యక్షంగా పని చేస్తున్నారని కేటీఆర్ వివరించారు. ఒక ఐటీ కంపెనీ ఉంటే దాని చుట్టూ ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయి. అమరారాజ యూనిట్ రావడం వల్ల ఇక్కడ ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 వేల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి. దీని వల్ల చుట్టు పక్కల ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.









