గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరు మీద రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ విడుదల చేశారని.. అదే స్ఫూర్తితో సరూర్ నగర్ సభలో హైదరాబాద్ డిక్లరేషన్ ను విడుదల చేస్తామని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలను ఎలా ఆదుకుంటామో హైదరాబాద్ డిక్లరేషన్ లో ప్రకటిస్తామని చెప్పారు. సరూర్ నగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో నియమించి ఎలా ఉద్యోగ నియామకాలు చేపడతామో సభలో వివరిస్తామన్నారు. ప్రియాంక గాంధీ సభలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వండని కేసీఆర్ ను అడగొద్దని.. కేసీఆర్, కేటీఆర్ ఉద్యోగాలు ఊడగొడితే ఆటోమెటిక్ గా అందరికీ ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.అందుకే ఈ యువ సంఘర్షణ సభ పెడుతున్నామన్నారు. ఈ సభకు పార్టీలకు అతీతంగా అందరూ తరలిరావాలని.. కేసీఆర్ విముక్త తెలంగాణ తీసుకొచ్చేందుకు సహకరించాలని.. విద్యార్థి, నిరుద్యోగులందరూ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.









