టికెట్ల ధరలను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
పర్యాటకులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. హైదరాబాద్లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన నెహ్రూ జూపార్క్ టికెట్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న జూపార్క్ టికెట్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూపార్క్ టికెట్ ధరను సాధారణ రోజుల్లో పెద్దలకు రూ.70, పిల్లలకు రూ. 45కు పెంచారు. సెలవులు, వీకెండ్స్లో పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.55కు టికెట్ ధరలను పెంచాలని నిర్ణయించారు.
గతంలో పెద్దలకు సాధారణ రోజుల్లో రూ.60, వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్లలో రూ.75గా ఉండేది. ఇక పిల్లలకు సాధారణ రోజుల్లో రూ.40, వీకెండ్స్, పబ్లిక్ హాలిడేస్ సమయాల్లో రూ.50గా టికెట్ ధర ఉండేది. త్వరలోనే పెంచిన టికెట్ ధరలను అమలు చేయనున్నారని తెలుస్తోంది. కానీ ఎప్పటినుంచి పెంచుతారనే దానిపై ఇంకా ఒక ప్రకటన రాలేదు. వేసవి దృష్ట్యా జూపార్క్కు రద్దీ బాగా పెరిగింది. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో పిల్లలను జూపార్క్కు తీసుకెళ్తున్నారు. వేసవి కావడంతో చల్లదనంతో పాటు వివిధ రకాల పక్షులు, జంతువులను చూసేందుకు చాలామంది సందర్శకులు జూపార్క్కు వస్తున్నారు.









