AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

పాడైన పంటను కేసీఆర్‌కు గిఫ్ట్‌గా పంపిన షర్మిల

సీఎం కేసీఆర్‌కు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరో గిఫ్ట్ పంపించారు. పంట నష్టపోయిన రైతుల తరపున పాడైన పంటతో ఉన్న ట్రక్కును ప్రగతిభవన్‌కు పంపిస్తున్నట్లు షర్మిల తెలిపారు. మంగళవారం లోటస్‌పాండ్‌ వద్ద షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల పంటను చూపించారు. పాడైన పంట ఉన్న ట్రక్కును చూపించిన షర్మిల.. దీనికి కేసీఆర్‌కు బహుమతిగా పంపిస్తున్నట్లు తెలిపారు. కేసీఆర్ ఇది చూసి అయినా సరే ప్రగతిభవన్ నుంచి బయటకు రావాలని, రైతులను అదుకోవాలని కోరారు.

తెలంగాణ రైతులు, ప్రజల తరపున పాడైన పంటను కేసీఆర్‌కు గిఫ్ట్‌గా పంపిస్తున్నట్లు షర్మిల స్పష్టం చేశారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయి ఇబ్బందులు పడుతున్నా.. కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పంట నష్టపోయిన రైతులకు ఇస్తానని చెప్పిన పరిహారం కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని విమర్శించారు. పంట నష్టపోయిన ప్రాంతాల్లో తాము పర్యటించి నష్టపోయిన పంటను కేసీఆర్‌కు గిఫ్ట్‌గా ఇవ్వడానికి తీసుకొచ్చినట్లు షర్మిల తెలిపారు. ట్రక్కులో ఉన్నది పాడైన పంట కాదని, రైతుల కన్నీళ్లు అని అన్నారు. అప్పులు చేసి, భార్యల పుస్తెలు కూడా తాకట్టు పెట్టి కష్టపడి రైతులు పంట పడిస్తే వర్షాల వల్ల పాడై పోయిందన్నారు.

కేసీఆర్ బయటకు వచ్చి రైతుల సమస్యలు చూడరని, ఒకవేళ వెళ్లినా గాలి మాటలు చెప్పి వస్తారని షర్మిల విమర్శించారు. ఈ ట్రక్కును కేసీఆర్ ప్రగతిభవన్ లేదా ఫామ్‌హౌస్‌లో పెట్టుకుని నాలుగైదు రోజులు వరుసగా చూస్తే రైతులకు సాయం చేయాలన్న సోయ వస్తుందేమోనని షర్మిల అభిప్రాయపడ్డారు. ఇలా అయినా సరే కేసీఆర్ రైతులకు నష్టపరిహారం ఇస్తారేమోనని షర్మిల వ్యాఖ్యానించారు. పంట నష్టపోయిన రైతులను కేసీఆర్ వెంటనే ఆదుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.

ANN TOP 10