కొన్నిసార్లు ఎంతదూరం వెళ్లినా.. ఏ హోదాలో ఉన్నా జిహ్వరుచి వదలదు. అదే మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విషయంలోనూ జరిగింది. ఆయన అనుకుంటే మహా మహా ఫైవ్ స్టార్ హోటళ్ల నుంచే బ్రేక్ఫాస్ట్ వస్తుంది. సంప్రదాయానికి విలువ ఇచ్చే ఆయన అసలు ఇంటి ఫుడ్ను మించి బయటే తింటారని కూడా ఊహించలేం.
కానీ అదే వెంకయ్యనాయుడు కేవలం పాక ఇడ్లీకి ఫిదా అయిపోయారు. దాని ఫలితమే.. పాక హోటల్ వరకూ ఈయన ఈ జర్నీ..! విజయవాడ మున్సిపల్ ఎంప్లాయిస్ కాలనీలో ఓ హోటలుంది. దీన్నే పాక హోటల్ అంటారు. ఆ హోటల్లో ఇడ్లీ అంటే వెంకయ్యకు బాగా ఇష్టం. ఆ టేస్ట్, నాణ్యతకు ఫిదా అయిపోయిన ఆయన ఆ ఇడ్లీలకే ఆయన ఓ బ్రాండ్ అబాసిడర్ అయిపోయారు.
తోటి నాయకులతో కలిసి పనికట్టుకుని అక్కడికి వెళ్లిన ఆయన హ్యాపీగా ఓ ప్లేట్ ఇడ్లీ లాగించారు. హోటల్ యజమాని కృష్ణ ప్రసాద్ను అభినందించారు. ఆపై.. ఇడ్లీలు.. అవి ఇచ్చే ఆరోగ్యంపై నాలుగు మాటలు చెప్పారు. అనంతరం హోటల్లో టిఫిన్ చేసిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. ‘ఈ రోజు ఉదయం విజయవాడ లోని పాక హోటల్ లో చక్కటి ఇడ్లీని ఆస్వాదించాను.
నోరూరించే వేరుశనగ పచ్చడి, అల్లం పచ్చడి, కారప్పొడి, నెయ్యితో ఈ ఇడ్లీలు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి.గుబురు చెట్ల నీడన, సంప్రదాయం ఉట్టిపడే ఈ పాక హోటల్లో ఒకసారైనా ఇడ్లీ రుచి చూడాలి. మంచి రుచికరమైన ఇడ్లీని అందిస్తున్న నిర్వాహకులకు, సిబ్బందికి అభినందనలు. బలవర్ధకమైన మన భారతీయ సంప్రదాయ వంటలను, రుచులను కాపాడుకోవాలి’ అని ట్వీట్లో రాసుకొచ్చారు వెంకయ్యనాయుడు.









