సిరియాలోని ఐఎస్ ఉగ్రవాదుల స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని టర్కీ దళాలు దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఐఎస్ చీఫ్ హతమైనట్టు తెలుస్తోంది. ఐరోపా, మధ్యప్రాచ్యంలో దాడులకు ఐఎస్ ప్రణాళికలు వేస్తోందని పేర్కొంటూ ఉత్తర సిరియాలోని ఆ ఉగ్రవాద సంస్థ స్థావరాలపై ఏప్రిల్లో హెలికాప్టర్ దాడి నిర్వహించింది. సిరియాలో ఏప్రిల్ 16న కనీసం 41 మంది అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులను చంపారు.
ఎంఐటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ చేపట్టిన ఆపరేషన్లో ISIS అనుమానిత నాయకుడు సిరియాలో హతమైనట్టు తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ వెల్లడించారు. ఆయన టెలివిజన్లో మాట్లాడుతూ.. ‘అనుమానిత నేత డేష్ కోడ్నేమ్ అబు హుస్సేన్ అల్-ఖురాషి సిరియాలో ఎంఐటీ నిర్వహించిన ఆపరేషన్లో హతమయ్యాడు’ అని పేర్కొన్నారు.
అఫ్రిన్ వాయువ్య ప్రాంతంలోని జిండిరెస్లో ఒక జోన్ను టర్కీ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు, స్థానిక మిలిటరీ పోలీసులు చుట్టుముట్టి.. ఇస్లామిక్ పాఠశాలగా వినియోగిస్తోన్న పాడుబడిన పొలాన్ని లక్ష్యంగా చేసుకున్నారని ఏఎఫ్పీ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తర సిరియాలో 2020 నుంచి టర్కీ తన దళాలను మోహరించింది. సిరియా దళాల సహాయంతో మొత్తం జోన్లను నియంత్రిస్తుంది.









