AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

విమానాశ్రయంలో వివాహిత ఆత్మహత్య

చెన్నైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. అక్కడి విమానాశ్రయం ఆవరణలో కొత్తగా నిర్మించిన మల్టీలెవెల్ పార్కింగ్ టెర్మినల్‌పై నుంచి దూకి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఐశ్వర్య(35)గా గుర్తించారు. పీఎస్-2 చిత్రాన్ని వీక్షించేందుకు తన ఇద్దరు పిల్లలతో వచ్చిన ఐశ్వర్య సినిమా మధ్యలోనే చిన్నారులను థియేటర్‌లో వదిలి బయటకు వచ్చేసింది. ఆ తరువాత, పార్కింగ్ భవంతి నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. పై నుంచి ఎవరో కింద పడటాన్ని గుర్తించిన పార్కింగ్ సిబ్బంది పరుగు పరుగున వెళ్లి చూడగా ఐశ్వర్య రక్తపుమడుగులో కనిపించింది. ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్టు వైద్యులు ప్రకటించారు.

తల్లి మరణ వార్త తెలియని ఆమె కుమారుడు, కుమార్తె సినిమా చూస్తూ ఉండిపోయారు. చివరకు తల్లి కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. ప్రస్తుతం వారు పోలీసుల సంరక్షణలోనే ఉన్నారు. ఐశ్వర్య భర్త బాలాజీ హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుండగా, ఐశ్వర్య మాత్రం తన పిల్లలతో మరోప్రాంతంలో ఉంటోంది. గత కొంత కాలంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నట్టు బంధువులు పేర్కొన్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఐశ్వర్య ఆత్మహత్యకు గల కారణాలు వెలికి తీసేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

ANN TOP 10