

జేపీఎస్ ఓపీఎస్ ల పోరాటానికి కంది శ్రీనన్న మద్దతు
ప్రభుత్వం దిగొచ్చేవరకు పోరాడుదామంటూ పిలుపు
ఆదిలాబాద్: న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూనియర్, ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు చేస్తున్న పోరాటానికి తాను అన్నివేళలా అండగా ఉంటానని, తనవంతు సహకారం అందిస్తానని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. జూనియర్, అవుట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులందరినీ క్రమబద్ధీకరించాలని కోరుతూ ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మెకు కంది శ్రీనివాసరెడ్డి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. సమ్మె శిబిరాన్ని సందర్శించి 50 వేల రూపాయల తక్షణ ఆర్థికసాయం అందించి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పోరాటం ఫలించేవరకూ మీ వెంట నేనుంటానంటూ భరోసా వారికి కల్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటోందని, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మొండివైఖరి ప్రదర్శిస్తోందని కంది శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో కీలకభూమిక పోషించే వారి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ సర్కార్ను ఉద్దేశించి ఆయన తీవ్రంగా విమర్శించారు. పుట్టింది మొదలు మరణించే వరకూ అటు ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా పక్కగా అమలు చేస్తూ ప్రజలకు విశేషమైన సేవలు అందిస్తున్నారని అన్నారు.
అలాంటి వారిని సర్కార్ విస్మరించడం సిగ్గుచేటని అభివర్ణించారు. పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయడంతోపాటు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పంచాయతీ కార్యదర్శుల న్యాయమైన డిమాండ్లు నెరవేరేవరకూ తాను వారికి అండగా ఉంటానని, అవసరమైతే ప్రత్యక్ష పోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు గొర్ల రాజు యాదవ్, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.









