హరిత ప్రమాణాలతో భవనాలను నిర్మిస్తే అందులో పని చేస్తున్న వారి ఉత్పాదకత పెరుగుతుందని హరిత భవన మండలి హైదరాబాద్ చాప్టర్ ఛైర్మన్ సి.శేఖర్రెడ్డి తెలిపారు. విద్యుత్తు, నీటి వినియోగంలో 30 నుంచి 40 శాతం ఆదా అవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని కూడా హరిత భవన మండలి ప్రమాణాల మేరకు నిర్మించారని వెల్లడించారు.
అయితే కొత్త సచివాలయం గోల్డ్ రేటింగ్ కోసం ఎంపికైందన్నారు. అయితే ఆ రేటింగ్ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో ఇంకోటి లేదు. హరిత ప్రమాణాల మేరకు భవనాలను నిర్మించనున్నట్లు ఆయా సంస్థలు ఐజీబీసీకి దరఖాస్తు చేసుకుంటాయి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్ ఉంటుంది.
నిపుణుల బృందం ఆ నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణ తీరుతెన్నుల గురించి తెలుసుకుంటుంది. గాలి, వెలుతురు పుష్కలంగా భవనంలోకి రావాలి. అలాగే నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సర్స్, ఆటోమేటిక్ విద్యుత్తు పరికరాలు వినియోగించాలి. ఇలాంటి నిబంధనలు పాటిస్తే ప్లాటినం, గోల్డ్, సిల్వర్, సర్టిఫికెట్.. ఇలా గుర్తింపు ఇస్తారు.









