సికింద్రాబాద్ కళాసిగూడలో నాలాలో పడి చిన్నారి మృతి చెందిన ప్రాంతాన్ని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి (GHMC Mayor Gadwal Vijayalakshmi) సందర్శించారు. అక్కడ పరిస్థితులను క్షేత్రస్థాయి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో కాషన్ బోర్డులు ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాంట్రాక్టర్, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూర్తి వివరాల కోసం చూస్తున్నామని.. వివరాలు వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పారు. పనులు జరుగుతున్న సందర్భంలో అధికారులు ఇచ్చే ఆదేశాలను ఎవరు అతిక్రమించవద్దని అన్నారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన భారీ కేడింగ్ తొలగిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాప కుటుంబాన్ని జీహెచ్ఎంసీ వైపు నుంచి ఆదుకుంటామని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి హామీ ఇచ్చారు.









