బీసీసీఐ స్పెషల్ కాంట్రాక్ట్ లిస్టులో అంజలి, మేఘనలకు చోటు
భారత మహిళల క్రికెట్ జట్టులో నిలకడగా రాణిస్తోన్న తెలుగమ్మాయిలకు బంపరాఫర్ దక్కింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా క్రికెటర్లు సబ్బినేని మేఘన, అంజలి శర్వాణీలకు మొదటిసారిగా బీసీసీఐ స్పెషల్ కాంట్రాక్ట్ లభించింది. తాజాగా బోర్డు ప్రకటించిన లిస్టులో మేఘన, అంజలి గ్రేడ్ ‘సి’ కాంట్రాక్టు లిస్టులో చోటు దక్కించుకున్నారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి లెఫ్టార్మ్ మీడియం పేసర్గా టీమిండియాలోకి అడుగుపెట్టింది. గతేడాది డిసెంబర్లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్తో అరంగేట్రం చేసిందామె.
ఇప్పటివరకు 6 టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఆమె 3 వికెట్లు తీసింది. ఇక మహిళల ప్రీమియర్లోనూ యూపీ వారియర్జ్ తరఫున ఆడి ఆకట్టుకుంది. అలాగే స్పెషలిస్ట్ బ్యాటర్గా టీమిండియాలోకి అడుగుపెట్టిన సబ్బినేని మేఘన ఇప్పటివరకు 3 వన్డేలు, 17 టీ20లు ఆడింది. అలాగే వుమెన్స్ ప్రీమియర్ లీగ్లో గుజరాత్ టైటాన్స్కు ప్రాతినిథ్యం వహించింది. మూడు గ్రేడ్లలో కలిపి మొత్తం 17 మందితో బీసీసీఐ వార్షిక కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. మే 2021 తర్వాత మహిళా క్రికెటర్లకు కాంట్రాక్ట్లు ప్రకటించడం ఇదే తొలిసారి.









