AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నక్సల్స్ ఘాతుకం.. 11 మంది జవాన్ల మృతి

మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఐఈడీ బాంబు పేల్చి 11 మంది ప్రాణాలు బలి తీసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 10 మంది డీఆర్జీ జవాన్లు, ప్రైవేట్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. ఈ ఘటన ఆర్మీ వర్గాలను, ప్రభుత్వాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. బుధవారం మధ్యాహ్నం జవాన్లతో వెళ్తున్న మినీ బస్సును లక్ష్యంగా చేసుకొని నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పేలుడు దాటికి జవాన్లు ప్రయాణిస్తున్న మినీ బస్సు తునాతునకలైంది. జవాన్ల శరీర భాగాలు ఎగిరిపడ్డాయి. పేలుడు జరిగిన ప్రదేశంలో భారీ గొయ్యి ఏర్పడింది. రక్తపు మరకలు, తెగిపడిన శరీర భాగాలతో ఘటనా స్థలం భీతావహంగా మారింది.

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ అణచివేత కార్యకలాపాల నిమిత్తం ‘డిస్ట్రిక్స్ రిజర్వ్ గార్డ్’ (DRG) బృందాలను ఏర్పాటు చేశారు. సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కొంత మంది జవాన్లతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన ఒక బృందం.. దంతేవాడ జిల్లాలోని అరన్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో నక్సల్స్ కదలికలకు సంబంధించిన సమాచారంతో బుధవారం ఉదయం కూంబింగ్‌‌కు వెళ్లింది. అనంతరం తిరిగి తమ స్థావరానికి వస్తుండగా నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.

మావోయిస్టులను విడిచిపెట్టేది లేదు..
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇది చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. ఈ పోరాటం చివరి దశలో ఉంది. మావోయిస్టులను విడిచిపెట్టేదిలేదు’ అని ఆయన అన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. సీఎం బఘెల్‌తో మాట్లాడారు. పేలుడు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ANN TOP 10