సింగర్ సునీత భర్త వీరపనేని రామకృష్ణను లక్ష్మణ్ అనే వ్యక్తి బెదిరిస్తూ మెసేజ్లను పంపాడు. దీంతో ఆయన బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు.
అసలు వీరపనేని రామకృష్ణకు బెదిరించిన వ్యక్తి ఎవరు ? ఎందుకు బెదిరించాల్సి వచ్చింది? అనే వివరాల్లోకి వెళితే, కె.కె.లక్ష్మణ్ అనే వ్యక్తి కొన్నాళ్లు ముందు రామకృష్ణకు తాను నిర్మాతల మండలి సభ్యుడినంటూ మెసేజ్ పెట్టారు. వ్యక్తిగతంగా కలిసి మాట్లాడాలనుకుంటున్నట్లు మెసేజ్ ద్వారా తెలియజేశారు. అయితే ఎవరో తెలియని వ్యక్తిని వ్యక్తిగతంగా కలవటం ఎందుకని భావించి రామకృష్ణ తన ఆఫీసుకి వచ్చి స్టాఫ్ను కలిసి విషయం తెలియజేయాలని కోరారు.
అయితే సదరు లక్ష్మణ్ అనే వ్యక్తి వినలేదు. వరుసగా మెసేజ్లను పంపుతూ వచ్చాడు. దీంతో ఆయన లక్ష్మణ్ నెంబర్ను బ్లాక్ చేశాడు. అయితే లక్ష్మణ్ మరో నెంబర్ ద్వారా రామకృష్ణకి మెసేజ్లను పంపటం స్టార్ట్ చేశాడు. ఈసారి ఏకంగా బెదిరింపులను స్టార్ట్ చేశాడు. ఇక ఉపేక్షించి లాభం లేదనుకున్న రామకృష్ణ.. తనకు, తన కుటుంబ సభ్యులకు లక్ష్మణ్ అనే వ్యక్తి నుంచి ప్రాణ హాని ఉందంటూ అతన్ని గుర్తించి కాపాడాలంటూ బంజారా హిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులకు కేసుని దర్యాప్తు చేస్తున్నారు.









