యూపీ గ్యాంగ్ స్టర్,మాజీ ఎంపీ అతీక్.. అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు వారిని ప్రయాగ్ రాజ్ లోని ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు తుపాకులతో కాల్చి హతమార్చారు.మీడియా ప్రతినిధులతో మాట్లాడుతుండగానే.. ఆకస్మాత్తుగా ముగ్గురు వ్యక్తులు వారిపై వరుస కాల్పులు జరిపారు. దీంతో వారు అక్కడిక్కడే మృతిచెందారు. కాల్పులు జరిపిన ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా అతీఖ్ అహ్మద్ 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు. ఇదిలా ఉండగా రెండు రోజుల క్రితమే అతీక్ అహ్మద్ కొడుకు అసద్ అహ్మద్, అతని స్నేహితుడు గులాంను యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ అధికారులు ఎన్కౌంటర్ చేశారు.
కిడ్నాప్లు, హత్యలు, బలవంతపు వసూళ్లు సహా అనేక నేరాలకు పాల్పడిది అతీఖ్ గ్యాంగ్. అతీఖ్పై కేసుల దర్యాప్తు, నేర విచారణకు అధికారులే భయపడే పరిస్థితి ఉండేది. గతంలో అతీఖ్ కేసుల విచారణ నుంచి 12 మంది న్యాయమూర్తులు కూడా తప్పుకున్నారు. యూపీలో యోగి సర్కార్ ఏర్పడ్డ తర్వాత నేరగాళ్లపై ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో వరుసగా వందల మంది నేరగాళ్ల ఎన్కౌంటర్.. యూపీలో క్రైం రేటును జీరోకి చేర్చింది.
అతీక్, అష్రఫ్ హత్యతో యూపీలో హై అలర్టు కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా అప్రమత్తమైన పోలీసులు..అన్ని జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎక్కడిక్కడ పోలీసు బలగాలను మోహరించారు. ముందు జాగ్రత్తగా రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అదనపు బలగాలను మోహరించారు.









