ఆడపిల్ల అంటే ఇంటికి మహాలక్ష్మి అని అంటుంటారు. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనే వారు.. కానీ ఇప్పుడు మారుతున్న సమాజంలో ఆడపిల్లే అదృష్టమని భావిస్తున్నారు. అయితే కొందరు మాత్రం ఇంకా వెనకటితరంలోనే మగ్గిపోతున్నారు. పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే వద్దనుకుంటున్నారు. పురిటిలోనే వదిలేసి వెళ్లిపోతున్న పరిస్థితి. మరికొందరు తమకు ఆడబిడ్డ వద్దు అంటూ కన్న తల్లిదండ్రులే వేరే వాళ్లకు విక్రయిస్తున్నారు.
తాజాగా ఇలాంటి ఘటనే కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిని ఆడశిశువును కన్నవారే అమ్మకానికి పెట్టారు. రామారెడ్డి మండలం స్కూల్ తండాకు చెందిన ఓ గర్భిణీ అన్నారం పీ.హెచ్.సీలో ప్రసవించింది. ఆ తల్లి.. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పుట్టిన వెంటనే తల్లిదండ్రులు శిశువును అమ్మేశారు. ఈ ఘటనపై పీహెచ్సీ సిబ్బంది.. పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఐసీడీఎస్ అధికారులు స్కూల్ తండాలో బాలింత ఇంటికి వెళ్లి దర్యాప్తు చేపట్టారు.









