తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మరియు ఏపీ గ్రీనింగ్, బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ తన నివాసం వద్ద ‘ప్రజా దర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను విన్నవించుకుంటూ సుగుణమ్మకు మొత్తం 54 అర్జీలను అందజేశారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి పరిష్కారం చూపే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆమె తెలిపారు.
వినతులు స్వీకరించిన అనంతరం, సుగుణమ్మ కొన్ని అత్యవసర సమస్యలపై తక్షణమే స్పందించారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఆ సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. మిగిలిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని ఆమె భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బుల్లెట్ రమణ, మునిశేఖర్ రాయల్, ఆముదాల తులసి రామ్, విశ్వనాథంలతో పాటు పార్లమెంట్ నాయకులు రేవతి, హేమావతి, సుజాతమ్మ, మురళి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రజల వినతుల పరిష్కారానికి పార్టీ యంత్రాంగం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు.








