AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అప్పులు చేసి ఉచితాలు ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యున్నత న్యాయస్థానం సూటి ప్రశ్న..

తమిళనాడులో ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాల పంపిణీ వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి కుంటుపడుతుందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పథకాల అమలుకు అవసరమైన నిధులు ఎక్కడి నుండి వస్తాయో వివరిస్తూ సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు విద్యుత్ పంపిణీ సంస్థతో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలకు ముందే ఇటువంటి పథకాలను ఎందుకు ప్రకటిస్తున్నారని రాజకీయ పార్టీలను ధర్మాసనం ప్రశ్నించింది.

 

పేదలకు విద్య, కనీస అవసరాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే అర్హత లేని సంపన్నులకు కూడా ఇటువంటి ఉచితాలు అందడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పెద్ద భూస్వాములకు సైతం ఉచిత విద్యుత్ అందించడం వల్ల వారు అనవసరంగా లైట్లు మెషీన్లు వాడుతున్నారని ఇది వనరుల దుర్వినియోగమేనని పేర్కొంది. ఏదైనా సౌకర్యం కావాలనుకున్నప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించాలి కదా అని జస్టిస్ సూర్యకాంత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీలు సామాజికవేత్తలు తమ సిద్ధాంతాలను పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు.

 

ప్రభుత్వం పంపిణీ చేసే ఈ ఉచితాల వెనుక ఉన్నది సామాన్య ప్రజలు చెల్లించే పన్నుల సొమ్ము అని కోర్టు గుర్తు చేసింది. రాష్ట్రాలు అప్పుల ఊబిలో ఉన్నప్పటికీ ఉచిత పథకాలకు పెద్దపీట వేయడం ఎన్నాళ్లు కొనసాగుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మీరు వసూలు చేసే ఆదాయంలో కనీసం 25 శాతాన్ని రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ఎందుకు ఉపయోగించకూడదని ప్రభుత్వాన్ని నిలదీసింది. ఉచితాల వల్ల దీర్ఘకాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

 

ప్రస్తుత పరిస్థితుల్లో ఉచిత పథకాల పంపిణీ ఒక సవాల్‌గా మారిందని దీనిపై లోతైన అధ్యయనం జరగాలని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఉపాధి అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టాలి కానీ కేవలం ఉచితాలతో కాలక్షేపం చేయడం సరికాదని పేర్కొంది. పన్ను చెల్లింపుదారుల సొమ్మును బాధ్యతాయుతంగా ఖర్చు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేస్తూ కేసు విచారణను వాయిదా వేసింది.

ANN TOP 10