AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వెంకన్నతో చంద్రబాబు చెలగాటం.. కల్తీ నెయ్యి పాపం హెరిటేజ్‌దే.-: భూమన

తిరుమల శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ అంశంపై కూటమి ప్రభుత్వం ఏక సభ్య కమిషన్ నియమించడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఏకంగా వేంకటేశ్వర స్వామితోనే చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. ఇప్పటికే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరుగుతున్న తరుణంలో ప్రత్యేకంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్‌తో వన్ మేన్ కమిషన్ వేయడం న్యాయస్థానాలను అవహేళన చేయడమేనని అభిప్రాయపడ్డారు. సిబిఐ లేదా సిట్ విచారణ చంద్రబాబు కనుసన్నల్లో సాగడం లేదని.. ఆయన ఆశించిన విధంగా నివేదికలు రావడం లేదు కాబట్టే ఈ కొత్త నాటకానికి తెరలేపారని ఆరోపించారు.

 

ఈ కమిషన్ నియామకం వెనుక లోతైన రాజకీయ ఎత్తుగడ ఉందని భూమన విమర్శించారు. జగన్ మోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డితో పాటు తనను దోషులుగా చిత్రించేందుకే ఈ కుట్ర పన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే 45 రోజుల పాటు తన అనుకూల మీడియా ద్వారా అసత్య కథనాలను వండించి విష ప్రచారం చేయడమే బాబు లక్ష్యమని పేర్కొన్నారు. సిట్ చేసిన కొన్ని సిఫార్సులు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేవని గుర్తు చేశారు. వన్ మేన్ కమిషన్‌కు చైర్మన్‌గా చంద్రబాబు ఉంటే సరిపోతుందని.. కేవలం బద్నాం చేసేందుకే ఇదంతా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట సమయంలోనూ ఇలాగే ఏక సభ్య కమిషన్ వేసి ఏం సాధించారో అందరికీ తెలుసని గుర్తు చేశారు.

 

కల్తీ నెయ్యి వ్యవహారం అసలు హెరిటేజ్ సంస్థలోనే ప్రారంభమైందని భూమన సంచలన ఆరోపణ చేశారు. కుటిల రాజకీయాలు చేయడానికి పవిత్రమైన నెయ్యిని పావుగా వాడుకున్నారని ధ్వజమెత్తారు. 2013 నుంచి 2019 వరకు ప్రీమియర్ డైరీ ద్వారా నెయ్యి సరఫరా చేసిన వైనాన్ని ఎండగట్టారు. బోలే బాబా డైరీని తెచ్చింది కూడా చంద్రబాబు నాయుడేనని చెప్పారు. 20 లక్షల కేజీల సరఫరాకు కేఎంఎఫ్ టెండర్ తీసుకుని కేవలం 10 లక్షల కేజీలే ఎందుకు సరఫరా చేశారో చెప్పాలని నిలదీశారు. సింగిల్ టెండర్ ఉన్నప్పుడు ఎల్-2 సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తూ కొన్ని ఆధారాలను మీడియా ముందు ఉంచారు.

 

చంద్రబాబు చేస్తున్న తప్పులను దేవుడు ఎప్పటికీ క్షమించడని భూమన హెచ్చరించారు. భగవంతుడిని రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం వల్ల ఇప్పటికే చంద్రబాబు దైవాగ్రహానికి గురయ్యారని వ్యాఖ్యానించారు. ఈ వివాదం కారణంగా హెరిటేజ్ సంస్థ షేర్లు పడిపోయాయని.. ప్రజల సమక్షంలో చంద్రబాబు చులకన అయ్యారని చెప్పారు. సుప్రీంకోర్టు అంటే లెక్కలేనట్లుగా వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి చేటని అన్నారు. కేవలం ఎల్లో మీడియాలో విస్తృత ప్రచారం కోసం వేసిన ఈ కమిటీ విచారణను తాము రాజకీయ డ్రామాగానే పరిగణిస్తున్నామని స్పష్టం చేశారు.

ANN TOP 10