ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో శాంతిభద్రతలపై జరిగిన చర్చ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తూ మాట్లాడటం వల్లే చట్టపరమైన చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. “ముఖ్యమంత్రి తల్లిని అవమానిస్తే ఊరుకుంటామా?” అని ప్రశ్నిస్తూ, మహిళల గౌరవం విషయంలో తమ ప్రభుత్వం అత్యంత కఠినంగా ఉంటుందని ప్రకటించారు. హౌస్ లోపల అయినా, బయట అయినా మహిళలను కించపరిచే వారిని ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందనను తప్పుబడుతూ, ఒక తల్లిని అవమానించడం కేవలం ‘రెండు చిన్న మాటలు’ ఎలా అవుతాయని లోకేశ్ నిలదీశారు. సొంత తల్లిని, చెల్లిని గౌరవించే సంస్కారం తమకు ఉందని, ఆ అలవాటు లేని వారే ఇలాంటి వ్యాఖ్యలను సమర్థిస్తారని వైఎస్సార్సీపీ సభ్యులకు చురకలు అంటించారు. గతంలో టీడీపీ కార్యకర్త ఎవరైనా తప్పు చేస్తే తాము వెంటనే చర్యలు తీసుకుని జైలుకు పంపించామని, అది తమ చిత్తశుద్ధికి నిదర్శనమని గుర్తుచేశారు. జగన్ తల్లి అయినా, మరెవరి తల్లి అయినా.. మహిళల జోలికి వెళ్తే ప్రజా ప్రభుత్వం ఉపేక్షించదని పవన్ కల్యాణ్, చంద్రబాబులు ముందే స్పష్టం చేశారని తెలిపారు.
గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన పరిణామాలను ప్రస్తావిస్తూ లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “గతంలో అసెంబ్లీ సాక్షిగా మా తల్లిని అవమానిస్తే మీరు ఏం చేశారు? పార్టీ కార్యాలయంపై దాడులు జరిగితే ఏం చర్యలు తీసుకున్నారు?” అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు వాడిన పదజాలాన్ని సభ్యులందరూ గమనించాలని, అది తప్పో ఒప్పో వైఎస్సార్సీపీ నాయకత్వం తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. తమపై ఎలాంటి కక్ష సాధింపులు లేవని, కేవలం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడటానికే ఈ చర్యలు చేపడుతున్నామని సభలో స్పష్టం చేశారు.








