AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“గాడిదకు గడ్డి వేసి.. ఆవుకు పాలు పిండితే ఎలా?” – నిజామాబాద్ ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం

మున్సిపల్ ఎన్నికల వేళ నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. “గాడిదకు గడ్డి వేసి.. ఆవు దగ్గర పాలు పిండలేము” అంటూ తనదైన శైలిలో సామెతను వాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని, అభివృద్ధి జరగాలంటే మున్సిపాలిటీల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులనే గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రెండుసార్లు గెలిచినా జిల్లాకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు.

బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ‘ఫెవికాల్ బంధం’ ఉందని రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపించారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను జైల్లో పెడతామని గతంలో ప్రగల్భాలు పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇప్పుడు ఆయనను ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. వీరిద్దరూ లోపాయికారీ ఒప్పందంతో ముందుకు సాగుతున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదని, మున్సిపల్ శాఖ మంత్రిగా తానే స్వయంగా నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో ఈసారి భారీ పోటీ నెలకొందని, టికెట్ వచ్చిన అభ్యర్థులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకుండా అందరినీ కలుపుకుని పోవాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని క్యాడర్‌కు పిలుపునిచ్చారు. మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యత ఇచ్చామని, సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు రెచ్చగొట్టే విద్వేషాలకు లోనుకాకుండా కేవలం అభివృద్ధి ప్రాతిపదికన ఓట్లు అడగాలని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు.

ANN TOP 10