పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. సభా మర్యాదలను ఉల్లంఘించి, స్పీకర్ ఛైర్ వైపు కాగితాలు విసిరినందుకు గాను ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలపై వేటు పడింది. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు వీరిని సస్పెండ్ చేస్తూ ఇన్చార్జి స్పీకర్ దిలీప్ సైకియా నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన వారిలో అమరీందర్ సింగ్ రాజా వారింగ్, మాణికం ఠాగూర్, హిబి ఈడెన్ వంటి ప్రముఖ నేతలు ఉన్నారు.
ఈ గందరగోళానికి ప్రధాన కారణం చైనా సరిహద్దు వివాదం. తూర్పు లడఖ్లో చైనా ఆక్రమణలపై చర్చ జరగాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పట్టుబట్టారు. మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే పుస్తకంలోని అంశాలను ఆయన ప్రస్తావిస్తుండగా, ధృవీకరించని కథనాలను చదవకూడదని స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాహుల్ స్పందిస్తూ, “నేను ప్రతిపక్ష నాయకుడిని, మాట్లాడటానికి నాకు ఎవరి అనుమతి అవసరం లేదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించడంతో సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ వెల్లోకి దూసుకెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలపడంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. నిరసన పేరుతో ప్రొసీడింగ్స్ను అడ్డుకోవడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని స్పీకర్ మండిపడ్డారు. ఈ గొడవ మధ్యే టీడీపీ ఎంపీ హరీశ్ బాలయోగి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, నిరసనల హోరు తగ్గకపోవడంతో సభను బుధవారానికి వాయిదా వేశారు.









