ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన ఎమ్మెల్యే (రైల్వే కోడూరు) అరవ శ్రీధర్కు సంబంధించిన రాసలీలల వీడియో వ్యవహారం పెను తుఫాను సృష్టించింది. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది జనసేన కాదని, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ‘కామసేన’ అని ఆమె ఘాటుగా విమర్శించారు. బాధితురాలి ఆరోపణల ప్రకారం.. ఉద్యోగం ఇప్పిస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏడాదిన్నర కాలంగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారని, ఈ క్రమంలో ఐదుసార్లు బలవంతంగా అబార్షన్ చేయించారని రోజా మండిపడ్డారు.
ఈ వివాదానికి నిరసనగా రోజా తన సొంత నియోజకవర్గమైన నగరిలో వైసీపీ శ్రేణులతో కలిసి భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల పార్టీ అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి తదితరులతో కలిసి ఏజేఎస్ కళ్యాణ మండపం నుంచి ఓం శక్తి ఆలయం వరకు నడుస్తూ నినాదాలు చేశారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి, అధికార మదంతో ఒక మహిళా ఉద్యోగినిని బెదిరించి, ఆమె పసిబిడ్డను చంపేస్తానని హెచ్చరించిన కీచక ఎమ్మెల్యేను తక్షణమే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
రాజీనామా చేయాల్సిందే: రోజా డిమాండ్
ఈ సందర్భంగా రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. “ఆడవాళ్లకు అన్యాయం జరిగితే రోమాలు పీకేస్తా అని సినిమా డైలాగులు చెప్పే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారు?” అని ప్రశ్నించారు. తప్పు చేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా త్రీ-మెన్ కమిటీ పేరుతో కాలయాపన చేయడం సిగ్గుచేటని అన్నారు. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత తమ పదవులకు రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.









