వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వాలంటీర్ వ్యవస్థపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వాలంటీర్ల వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ వ్యవస్థే పార్టీకి నష్టం చేకూర్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. వాలంటీర్ల కారణంగా ఎమ్మెల్యేలకు, సామాన్య ప్రజలకు మధ్య దూరం పెరిగిందని, దీనివల్ల నేతలు నేరుగా ప్రజల సమస్యలను తెలుసుకోలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవేళ భవిష్యత్తులో వైఎస్ జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా, వాలంటీర్లను తిరిగి తీసుకోవద్దని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వాలంటీర్లు లేకపోయి ఉంటే గత ఎన్నికల్లోనే వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకు న్యాయం జరగాలంటే వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టాలని, అప్పుడే క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం అవుతుందని ఆయన సూచించారు.
ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో, వాలంటీర్ వ్యవస్థ దాదాపు కనుమరుగైంది. గత ప్రభుత్వం వీరి నియామకంపై సరైన ఉత్తర్వులు ఇవ్వలేదని ప్రస్తుత ప్రభుత్వం స్పష్టం చేయడంతో వాలంటీర్లు అయోమయంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో సొంత పార్టీ ఎమ్మెల్యేనే వాలంటీర్ల వల్ల పార్టీ కొంప మునిగిందని అనడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కార్యకర్తలు, నేతలు ఉంటేనే పార్టీ మనుగడ సాగిస్తుందని బాలనాగిరెడ్డి నొక్కి చెప్పారు.









