కోర్టు తీర్పుతో మార్గం సుగమం
కేసీఆర్కు బిగ్ షాకే..
నిజమవుతున్న పీసీసీ చీఫ్ వ్యాఖ్యలు
రాష్ట్ర వ్యాప్తంగా హాట్హాట్ చర్చ
కాంగ్రెస్లోకి 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నట్లు సమాచారం. త్వరలో జంప్ అయ్యేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాకే.. త్వరలోనే 15 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వస్తారంటూ ఇటీవల టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
కోర్టు తీర్పుతో తెలంగాణ కాంగ్రెస్ మళ్లీ చేరికలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ త్వరలోనే 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతారంటూ కామెంట్స్ చేశారని పార్టీ వర్గాల సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలతో మరోసారి చేరికలపై జోరుగా చర్చ సాగుతోంది. కేసీఆర్, కేటీఆర్ పక్కన ఉండే ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. దీంతో పార్టీ మారే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. నిజంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధం అవుతున్నారా? లేక హస్తం పార్టీ వ్యూహాత్మకంగా మైండ్ గేమ్ ఆడుతోందా? అన్న అంశంపై చర్చ సాగుతోంది.
ఇటీవల ఆగిన చేరికలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ కు 64 సీట్లు వచ్చాయి. తెలంగాణ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 60 సీట్లు. దీంతో ఉండాల్సిన సంఖ్య కన్నా కేవలం 4 సీట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ప్రారంభించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంది. ఈ పరిణామంతో అలర్ట్ అయిన బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టు తీర్పుతో..
అయితే.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ ను సింగిల్ బెంచ్ జడ్జి ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన ధర్మాసనం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. సహేతుకమైన సమయంలో నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. అయితే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే కారణంతో ఎమ్మెల్యేలు చేరకుండా ఆగారని.. ఇప్పుడు చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.