రేపు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సాయంత్రం కేరళ కు వెళ్లనున్నారు. బుధవారం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. వయనాడ్ నుంచి ఎంపీగా ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు.
కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకం..
వయనాడ్ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్కు ప్రతిష్టాత్మకంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక తొలిసారిగా ఎన్నికల బరిలో నిలవడంతో అధిష్ఠానం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రియాంక గాంధీ గెలుపు కోసం యావత్ కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్తోపాటు రాయ్ బరేలీ స్థానం నుంచి పోటీ చేసి, రెండుచోట్లా విజయం సాధించారు. రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కొనసాగుతూ వయనాడ్ స్థానానికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గాంధీ కుటుంబాన్ని రాయ్ బరేలి, అమేథీ తర్వాత అక్కున చేర్చుకున్న నియోజకవర్గం వయనాడ్. 2019లో కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి పాలవగా, వయనాడ్ మాత్రం అఖండ విజయాన్ని అందించింది. 2024 లోకసభ ఎన్నికల్లోనూ అక్కడి ప్రజలు రాహుల్ గాంధీని అక్కున చేర్చుకున్నారు. అత్యధిక మెజారిటీతో గెలిపించారు.









