లోక్సభ, అసెంబ్లీ ఉప ఎన్నికల అభ్యర్థుల జాబితాను బీజేపీ (BJP) శనివారంనాడు రిలీజ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తు్న్న కేరళలోని వయనాడ్ (Wayanad) లోక్సభకు నవ్య హరిదాస్ (Navya Harida) పేరును ప్రకటించింది. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ (Priyanaka Gandhi)ని ఇప్పటికే తమ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కాగా, అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేసే 24 మంది అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది.
నవ్య హరిదాస్ వెర్సస్ ప్రియాంక
లోక్సభ ఎన్నికల్లో రెండు చోట్ల రాహుల్ గాంధీ గెలవడంతో వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో రాహుల్ స్థానంలో ప్రియాంక గాంధీ వాద్రాను ఉప ఎన్నికల బరిలోకి కాంగ్రెస్ దింపుతోంది. బీజేపీ వ్యూహాత్మకంగా నవ్య హరిదాస్ పేరును తాజాగా ప్రకటించింది. బీజేపీలో డైనమిక్ లీడర్గా నవ్య హరిదాస్ పేరు తెచ్చుకున్నారు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన నవ్య హరిదాస్ 2007లో బీటెక్ పూర్తి చేసారు. కోజికోడ్ కార్పొరేషన్కు రెండుసార్లు కౌన్సిలర్గా ఉన్నారు. కార్పొరేషన్లో బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా కొనసాగుతున్నారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందిస్తున్నారు. 2021లో జరిగిన కోజికోడ్ సౌత్ నియోజవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు.
నవ్య హరిదాస్ స్పందన
వయనాడ్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ఎంపిక చేయడంపై నవ్య హరిదాస్ స్పందించారు. వయనాడ్ ప్రజలతో మేకమయ్యే వ్యక్తిగా తనను పార్టీ అధిష్ఠానం ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు. చుట్టపుచూపుగా వయనాడ్కు వచ్చే వారు కాకుండా, ప్రజలతో ఉండి, వారి సమస్యలను అవగాహన చేసుకుని, పరిష్కరించేందుకు ప్రయత్నించే వ్యక్తే వయనాడ్కు కావాలన్నారు. బీజేపీ ఆలోచన కూడా ఇదేనన్నారు. వయనాడ్ అభివృద్ధికి ప్రజలతో కలిసి పనిచేసేందుకు, వారి సమస్యలను పార్లమెంటు దృష్టికి తెచ్చేందుకు పని చేస్తానని చెప్పారు.









