– ఇప్పుడు నంగనాచి నాటకాలా?
– ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బీఆర్ఎస్కు బుద్ధిరాలేదంటూ మంత్రి ఆగ్రహం
(మహా, హైదరాబాద్):
రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి సీతక్క బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను బంద్ పెట్టిందంటూ హరీశ్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన సీతక్క.. కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరను బంద్ పెట్టారంటూ హరీశ్ రావు మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలా నాసి రకం చీరలిచ్చి మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచిందో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు నంగనాచి నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు.
తమ ప్రజా ప్రభుత్వంలో మహిళలకు బతుకమ్మ చీరలకు మించిన ఆర్థిక ప్రయోజనాలను కల్పిస్తున్నామని తెలిపారు. బతుకమ్మ చీరలకు గత ప్రభుత్వం ఏడాదికి రూ.300 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, కానీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తూ వారికి ఆర్థిక స్వేచ్ఛ కల్పిస్తున్నామని తెలిపారు. నిన్నటి దాకా 98.50 కోట్ల మంది ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించారని, ఈ పథకం కోసం తమ ప్రజా ప్రభుత్వం ఏకంగా రూ.3,325 కోట్లు ఖర్చు చేస్తోందని సీతక్క తెలిపారు. గత ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టినా బీఆర్ఎస్కు బుద్ధిరాలేదంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.









