తిరుమల లడ్డూ వివాదం వ్యవహారంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) మధ్య డైలాగ్ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరు యాక్టర్లు ఎవరి స్టైల్లో వాళ్లు పంచ్ వేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నారు. ఇప్పటికే వరుస ట్వీట్స్తో తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి తాజా పరిణాలపై మరో ట్వీట్ చేశాడు.
మనకేం కావాలి.. ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా.. ? లేక ప్రజల మనోభావాలు గాయపడకుండా.. పరిపాలనా సంబంధమైన.. అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..? అని ప్రశ్నిస్తూ #justaskingను జోడించాడు. ప్రకాశ్ రాజ్ వరుస ట్వీట్లపై మరి పవన్ కల్యాణ్ రియాక్షన్ ఎంటనేది సస్పెన్స్ నెలకొంది.
లడ్డూ వివాదంపై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. మీరు (పవన్ కల్యాణ్) ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. మీరెందుకు ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారు. దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేయగా.. ఈ వ్యవహారంతో ప్రకాశ్ రాజ్కు సంబంధమేంటని పవన్ కల్యాణ్ ఫైర్ అయ్యారని తెలిసిందే.
పవన్ కల్యాణ్ కామెంట్స్పై ప్రకాశ్ రాజ్ స్పందిస్తూ.. పవన్ కల్యాణ్కు వీలైతే తన ట్వీట్ను మళ్లీ చదివి.. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ విదేశాల నుంచి ఓ వీడియో సందేశాన్ని కూడా షేర్ చేశాడు. అనంతరం చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్ను జోడించాడు.
అంతటితో ఆగకుండా గెలిచే ముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు మనకీ అయోమయం.. ఏది నిజం..? జస్ట్ ఆస్కింగ్..? అంటూ మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. ఇలా వరుస ట్వీట్ వార్తో హోరెత్తిస్తున్న విలక్షణ నటుడికి పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తాడన్నది చూడాలి మరి.
మనకేం కావాలి…
ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి ..తద్వారా రాజకీయ లబ్ధిని సాధించటమా..?
లేక ప్రజల మనోభావాలు
గాయపడకుండా..పరిపాలనా సంబంధమైన..అవసరమైతే తీవ్రమైన చర్యలతో.. సున్నితంగా సమస్యను పరిష్కరించుకోవటమా..?
జస్ట్ ఆస్కింగ్ #justasking
— Prakash Raj (@prakashraaj) September 27, 2024